న్యూఢిల్లీ: హోలీ (Holi ) పై ఆంక్షలు విధించారు. దీంతో యూనివర్సిటీ హాస్టల్కు చెందిన మహిళా విద్యార్థినులు నిరసన తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బుధవారం హోలీ సందర్భంగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆంక్షలు విధించారు. హాస్టల్ విద్యార్థినులు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాంగణం నుంచి బయటకు వెళ్లకూడదంటూ నోటీస్ జారీ చేశారు. ‘హాస్టల్ నివాసితులు మార్చి 8వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలి. హోలీ పండుగ రోజున అతిథులు, సందర్శకులకు అనుమతి లేదు’ అని అందులో పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థినులు ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని షరతులు విధించారు.
కాగా, బుధవారం హోలీతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా. ఈ నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మహిళా విద్యార్థులు ఈ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించారు. బుధవారం మధ్యాహ్నం వర్సిటీలోని రాజీవ్ గాంధీ బాలికల వసతి గృహం వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆంక్షలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని తాము భావించినట్లు హాస్టల్ విద్యార్థునులు తెలిపారు. అయితే ఆంక్షల పేరుతో తమను లోపల ఉంచడంతోపాటు హాస్టల్ గేట్కు తాళాలు వేశారని విమర్శించారు. దీంతో మిగతా హాస్టల్స్లోని విద్యార్థులను కూడా కలుసుకోలేకపోయినట్లు వాపోయారు. బాయ్స్ హాస్టల్స్ వద్ద ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. వర్సిటీ క్యాంపస్లోని మహిళల హాస్టల్స్లోనే ఇలాంటి ఆంక్షలు విధించడంపై మండిప్డడారు. ఉమెన్స్ డే రోజున తమను కించపరిచేందుకు, అవమానించేందుకే వర్సిటీ యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆంక్షలు విధించిందని హాస్టల్ విద్యార్థినులు ఆరోపించారు.