PM Modi | న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేయటం అంటే క్రమశిక్షణ తప్పినట్టేనని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు కలిగిన తమ విద్యా సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించినందునే తాము ఎన్ఎస్యూఐ నేతను ఏడాది పాటు విద్యా సంస్థ నుంచి బహిష్కరించామని, తన డిబార్ను ఎత్తివేయాలన్న అతడి విజ్ఞప్తిని అంగీకరించలేమని వర్సిటీ అధికారులు హైకోర్టుకు స్పష్టం చేశారు.
2002లో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ తయారు చేసిన డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించింది. అయితే, ఢిల్లీ వర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి లోకేశ్చుగ్ వర్సిటీ ఆవరణలో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించి చూపారు. దీనిపై క్రమశిక్షణ చర్య కింద అతడిని యూనివర్సిటీ ఏడాది పాటు డిబార్ చేసింది. దీనిపై సోమవారం జరిగిన విచారణలో ఢిల్లీ వర్సిటీ తన వాదనను విన్పించింది. వాదనలు రికార్డెడ్గా లేనందున రాతపూర్వకంగా సమాధానాలు దాఖలు చేయాలని కోర్టు కేసును ఈ నెల 26కు వాయిదా వేసింది.