న్యూఢిల్లీ: ట్రాఫిక్ పోలీస్ అధికారిపై జనం దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం పది గంటలకు డియోలి రోడ్ ప్రాంతంలో ఒక స్కూటర్పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఒక మహిళ దానిని డ్రైవ్ చేస్తున్నది. రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవడంతో ట్రాఫిక్ పోలీస్ ఆ స్కూటర్ను ఆపాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆమె స్కూటర్ తాళాలు తీసుకెళ్లడంతో ఆయన ఐడీ కార్డు, ఆ ప్రాంతంలో జరిమానా విధించేందుకు ఉన్న అనుమతిని చూపమని ఆమె అడిగింది. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ పోలీస్ అధికారి రాజేంద్ర ప్రసాద్ ఆమెను కొట్టాడు. ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీయగా ఆ మహిళ పలుసార్లు కింద పడిపోయింది. దీంతో ఆయన తనపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించింది.
ఇంతలో స్థానికులు ఆ మహిళకు మద్దతుగా ముందుకు వచ్చారు. కొందరు ట్రాఫిక్ పోలీస్ అధికారి రాజేంద్ర ప్రసాద్పై దాడి చేశారు. ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఆయనను వెంబడించి మరీ కొట్టారు.చివరకు పోలీస్ అధికారులు, సిబ్బంది అక్కడకు వచ్చారు. ట్రాఫిక్ పోలీస్ అధికారి రాజేంద్ర ప్రసాద్ను బలవంతంగా వారి చెర నుంచి విడిపించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఈ సంఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారిపై దాడి చేయడం, ఆయన విధులకు ఆటంకం కల్పించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీస్ అధికారిపై దాడికి సంబంధించిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.