న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జనవరిలో శనివారం వరకు దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. గత 32 సంవత్సరాల్లో జనవరిలో వర్షాపాతం నమోదవడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాత్రి 9.30 గంటల వరకు ఢిల్లీలో 69.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 1989 జనవరిలో 79.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఆ తర్వాత వర్షాపాతం ఎక్కువగా నమోదవడం ఇదే మొదటిసారని చెప్పారు.
నగరంలో వర్షం కురవడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీ తగ్గి 14.7 డిగ్రీలకు చేరగా.. సగటు కంటే ఏడు డిగ్రీలు తక్కువగా నమోదైందని, ఈ సీజన్లో ఇదే తక్కువని అధికారులు తెలిపారు. పశ్చిమ అవాంతరాల కారణంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్లో ఆదివారం వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆదివారం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు.