న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ట్వీట్ చేశారు.
ఢిల్లీలో గురువారం రికార్డు స్థాయిలో 7,500కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఐదు వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి. కరోనా కేసుల మొత్తం సంఖ్య ఏడు లక్షలకు చేరింది. ఎయిమ్స్, గంగా రామ్ ఆసుపత్రుల్లోని వైద్యులు కరోనా బారినపడుతున్నారు.
కరోనా తీవ్రత నేపథ్యంలో ఢిల్లీలో ఈ నెల 6 నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనున్నది.