న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ మరింత కలవరపరుస్తున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 17,282 కరోనా కేసులు 104 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,438కు, మరణాల సంఖ్య 11,540కు పెరిగింది. బుధవారం 9,952 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 7,05,162కు, యాక్టివ్ కేసుల సంఖ్య 50,736కు చేరింది.
మరోవైపు ఢిల్లీలోని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 14 ప్రైవేట్ ఆసుపత్రులను పూర్తిగా కరోనా ఆసుపత్రులుగా ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇందులోని మొత్తం 3,553 పడకలను పూర్తిగా కరోనా రోగులకే కేటాయించి చికిత్స అందించనున్నారు. అలాగే ఈ ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని 35 శాతం పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కాగా, ఢిల్లీలో కరోనా తీవ్రత దృష్ట్యా సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో సమావేశం కానున్నారు. అలాగే ఆరోగ్య మంత్రితోపాటు ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో కరోనా పరిస్థితిపై చర్చించనున్నారు.