న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 1,094 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరు మృతి చెందగా.. 640 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,705కి పెరగ్గా.. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి చేరింది. 22,614 పరీక్షలు నిర్వహించగా.. కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ వివరించింది. తాజా కేసులతో దేశ రాజధానిలో కొవిడ్ కేసుల సంఖ్య 18,73,793కు పెరగ్గా.. వైరస్తో 26,166 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత కొద్ది రోజులుగా దేశ రాజధానిలో కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 11న 601 యాక్టివ్ కేసులు ఉండగా.. 3705కి చేరింది. అయితే, కేసులు పెరుగుతున్నా ఆసుపత్రిలో చేరే వారి రేటు తక్కువగానే ఉందని పేర్కొంది. మొత్తం యాక్టివ్ కేసుల్లో మూడుశాతం కంటే తక్కువనీ, పెరుగుతున్న కేసుల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్ నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులకు రూ.500 జరిమానా విధించాలని అధికారులను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.