న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చలి మెల్లమెల్లగా పంజా విసురుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. ఇవాళ ఉదయం 8:30 గంటలకు ఈ సీజన్లోనే అత్యంత తక్కువగా 6.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో దేశ రాజధాని నగరంలో చలి తీవ్రత పెరిగింది. ఈ విషయాన్ని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 6.4 డిగ్రీ సెల్సియస్ అంటే సగటు ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువ అని ఐఎండీ తెలిపింది.
కాగా, శనివారం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.3 డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. ఇదిలావుంటే ఈ ఉదయం 8:30 గంటలకు వాతావరణంలో తేమ కూడా 95 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇవాళ గరిష్ఠంగా 24 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనావేసింది. అదేవిధంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.