Arvind Kejriwal | దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలోని అన్ని ప్రాథమిక తరగతులను శనివారం నుంచి మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ‘ఢిల్లీలో శనివారం నుంచి ప్రాథమిక తరగతులు మూసివేస్తున్నాం. సరి బేసి విధానం గురించి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఐదు నుంచి పై తరగతి విద్యార్థుల అవుట్డోర్ క్రీడా కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గురువారం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 400 మార్క్ను దాటింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం.. ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరగా.. ఏక్యూఐ 408గా నమోదైంది. ప్రస్తుతం యూపీలోని నోయిడాలో 393, హర్యానాలోని గురుగ్రామ్లో 318గా నమోదైంది. సెంట్రల్ ఢిల్లీలోని మందిర్ మార్గ్ వంటి కొన్నింటిని మినహాయించి రాజధానిలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 300 కంటే ఎక్కువగా నమోదైంది.