Parliament security breach | న్యూఢిల్లీ : పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ వదిలిన ఘటనలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు నిందితులను కూడా తీసుకెళ్లి, సమగ్ర విచారణ చేపట్టారు.
ఈ విచారణ నిమిత్తం 50 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుల సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంకు ఖాతాలతో పాటు వారి వ్యక్తిగత వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక ప్రధాన సూత్రధారి లలిత్ ఝా.. తన మొబైల్తో పాటు మిగతా నిందితుల మొబైల్స్ను ధ్వంసం చేశాడు. ఆ ధ్వంసం చేసిన ఫోన్లను రాజస్థాన్లోని నాగౌర్ నుంచి ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు సాగర్ శర్మను సాకేత్ స్పెషల్ సెల్ పోలీసులు విచారిస్తున్నారు. లలిత్ ఝాను జనక్పురి స్పెషల్ సెల్ పోలీసులు, మనోరంజన్ను న్యూఢిల్లీ రేంజ్ స్పెషల్ సెల్ పోలీసులు, నీలం దేవిని ఢిల్లీ న్యూ ఫ్రెండ్స్ కాలనీ స్పెషల్ సెల్ పోలీసులు విచారిస్తున్నారు. ఇలా ఒక్కో నిందితుడిని ఒక్కో పోలీసు బృందం విచారించి, సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ విచారణ అనంతరం అందర్నీ ఎన్ఎఫ్సీ స్పెషల్ సెల్ పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది. ఆరుగురు నిందితులను ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించిన విషయం విదితమే.