Delhi Police : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా గురించి ఢిల్లీ పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అఫ్తాబ్ శిక్షణ పొందిన చెఫ్ అని అతనికి మాంసాన్ని ఎలా నిల్వ చేయాలో బాగా తెలుసు అని మంగళవారం కోర్టుకు పోలీసులు తెలిపారు. ‘అఫ్తాబ్ తాజ్ హోటల్ చెఫ్గా ట్రైనింగ్ తీసుకున్నాడు. అతడికి మాంసం పాడవకుండా నిల్వ చేయడం తెలుసు. అంతేకాదు శ్రద్ధాను హత్య చేసిన అనంతరం అతను డ్రై ఐస్, అగర్బత్తీలను ఆర్డర్ చేశాడు.
శ్రద్ధను చంపిన తర్వాత అతను మరొక అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆమెకు ఉంగరం కూడా ఇచ్చాడు’ అని ఢిల్లీలోని సాకెట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. శ్రద్ధా హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టకు వెల్లడించామని ఢిల్లీ పోలుసుల తరఫున వాదిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ తెలిపాడు. తదుపరి విచారణను కోర్టు మార్చి 20వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజుకు ముందే తమ వాదనలను దాఖలు చేయాలని అఫ్తాబ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ను ఆడిషనల్ సెషన్స్ జడ్జి మనీశ్ ఖురాన కక్కర్ ఆదేశించింది.
తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధాను అఫ్తాబ్ పోయిన ఏడాది మే నెలలో దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని ఫ్రిజ్లో దాచి పెట్టాడు. ఆన్లైన్లో రంపం ఆర్డర్ చేసి దాంతో శ్రద్ధ శరీరాన్ని 35 భాగాలుగా కట్ చేశాడు. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో అక్కడక్కడా పడేశాడు. శ్రద్ద బతికే ఉన్నట్టు అందరినీ నమ్మించేందుకు ఆమె సోషల్మీడియా ఖాతాలో పోస్టులు పెట్టాడు. అంతేకాదు ఆమె క్రెడిట్ కార్డు బిల్లు కూడా కట్టాడు. 2022 నవంబర్ నుంచి అఫ్తాబ్ పోలీస్ కస్టడీలో ఉంటున్నాడు. శ్రద్ధా వాకర్ హత్యకేసులో అఫ్తాబ్పై ఢిల్లీ పోలీసులు జనవరి 24న ఢిల్లీ పోలీసులు 6,629 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తున్న చార్జిషీట్లో పేర్కొన్నారు.