న్యూఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు హతమారుస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లిం దేశాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి నేపథ్యంలో నూపుర్ శర్మతో పాటు నవీన్కుమార్ జిందాల్ను బీజేపీ అధిష్ఠానం బహిష్కరించింది. దేశీయ మతసంస్థలతో పాటు కువైట్, ఖతార్, ఇరాన్ తదితర దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీజేపీ ఇద్దరు నేతలను సస్పెండ్ చేయడంతో పాటు ప్రకటన విడుదల చేసింది. పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని, వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది.