న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు నకిలీ డాక్టర్ల(Fake Doctors) ముఠా గుట్టును పోలీసులు విప్పారు. ఈ ఘటనలో ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు డాక్టర్లలో ఓ మహిళ సర్జన్ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ కూడా అరెస్టు చేశారు. గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఆస్పత్రి నడిపారు. ఆ హాస్పిటల్లో ఇద్దరు రోగులు మృతిచెందిన తర్వాత జరిగిన దర్యాప్తులో నకిలీ డాక్టర్లు ఉన్నట్లు తేలింది. డాక్టర్ నీరజ్ అగర్వాల్, ఆయన భార్య పూజా అగర్వాల్, డాక్టర్ జస్ప్రీత్ సింగ్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ మహేంద్ర సింగ్ను అరెస్టు చేశారు.
గ్రేటర్ కైలాశ్ హాస్పిటల్లో 2016 నుంచి 9 మంది రోగులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. డాక్టర్ నీరజ్ అగర్వాల్ ఫిజీషియన్ మాత్రమే. కానీ అతను అక్రమ రీతిలో సర్జరీలు చేస్తున్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. 2022లో ఓ రోగి గాల్బ్యాడర్ లో ఉన్న రాళ్ల గురించి చికిత్స తీసుకున్నాడు. అయితే సర్జరీ చేసిన తెల్లారి ఆయన మరణించాడు. ఆ వ్యక్తి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు. అయితే అసలు డాక్టరు సర్జరీ చేయలేదని, మరో డాక్టర్తో శస్త్ర చికిత్స చేయించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.
సర్జరీ సరిగా చేయకపోవడం వల్ల బ్లీడింగ్ అధికంగా జరిగిందని, దాంతో పేషెంట్ మరణించినట్లు గుర్తించామన్నారు. గత ఏడాది అక్టోబర్లో ఇలాంటిదే మరో కేసు జరిగిందని, విచారణ తర్వాత ఆస్పత్రిలో నాణ్యతలేని పరికరాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఫిజీషియన్ అయిన డాక్టర్ అగర్వాల్ తన వద్ద ఉన్న ఫేక్ డాక్యుమెంట్లతో మెడికల్ సర్జరీలు చేస్తున్నట్లు తేలింది.
డాక్టర్ల సంతకాలు ఉన్న 414 ప్రిస్కిప్షన్ స్లిప్లను పోలీసులు సీజ్ చేశారు. ప్రెగ్నెన్సీ టర్మినేషన్కు చెందిన వివరాలతో ఉన్న రెండు రిజిస్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గడువు ముగిసిన సర్జికల్ బ్లేడ్లు, పేషెంట్ల ఒరిజినల్ బిల్లులు, 47 బ్యాంకులకు చెందిన చెక్కుబుక్కులు, 54 ఏటీఎం కార్డులు, పాస్పోర్టులు, క్రెడిట్ కార్డు మెషీన్లను అగర్వాల్ ఇంటి నుంచి రికవరీ చేశారు.