న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైన గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పదివేల మంది బలగాలను పోలీసులు మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు ఎగురవేయకుండా అడ్డుకునేందుకు 400 మంది సైనికులను ప్రత్యేకంగా నియమించారు. ఎర్రకోట, ఢిల్లీ పోలీస్ కమాండోల చుట్టూ ఉన్న ఎత్తయిన భవనాలను స్వాధీనం చేసుకొని.. వాటిపై షూటర్లను మోహరించనున్నారు.
అలాగే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న రోహింగ్యాల కాలనీలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 15న భూమి నుంచి ఆకాశం వరకు అన్నింటిపై నిఘా వేస్తామని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ దీపేందర్ పాఠక్ పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వచ్చిన సమాచారం మేరకు.. అన్ని భద్రతా సంస్థల సమన్వయంతో ఎర్రకోట వద్ద సెక్యూరిటీ సర్కిల్ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సారి ఎర్రకోట చుట్టుపక్కల నో ఫ్లయింగ్ జోన్ అమలులో ఉంటుందని.. గాలిపటాలు, బెలూన్లు, డ్రోన్లు ఎగురడంపై నిషేధం ఉంటుందన్నారు. అలాగే వెయ్యికిపైగా అత్యాధునిక సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కెమెరాలతో సందర్శకులపై నిఘా వేయనున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని.. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. మరో వైపు ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేసి.. తనిఖీలు చేపట్టనున్నారు. 15న రోహింగ్యాల కాలనీల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ మేరకు ఆయా కాలనీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.