న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను సోమవారం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు విచారణలో భాగంగా ఆయన్ను జూన్ 9 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకున్నది. మనీల్యాండరింగ్ కేసులో నెల రోజుల క్రితం జైన్కు చెందిన సుమారు 4.81 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. కోల్కతాకు చెందిన కంపెనీతో హవాలా లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. లావాదేవీలు ఎక్కడ నుంచి ఎలా జరిగాయో తెలుసుకునేందుకు 14 రోజుల రిమాండ్ అవసరమని కోర్టును ఈడీ కోరింది. జైన్ జరిపిన లావాదేవీలపై అనుమానాలు ఉన్నాయని, ఆ డబ్బు ఆయనదా లేక ఇతరుల సొమ్మును ఆయన ల్యాండరింగ్ చేశారా అన్న విషయాన్ని తేల్చాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.