న్యూఢిల్లీ: మెట్రో ప్రయాణికుల కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ (DMRC) మరో సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై మెట్రో రైల్ ప్రయాణికులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సునాయాసంగా పేపర్ టికెట్ను పొందే వెసులుబాటు కల్పించింది. ఈ సదుపాయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఢిల్లీ మెట్రో తాజా నిర్ణయంతో ప్రయాణికుల సమాయం ఆదా కానుంది.
టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఎంట్రన్స్, ఎగ్జిట్ గేట్ల దగ్గర ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి పేపర్ టికెట్లు పొందవచ్చని DMRC తెలిపింది. ఢిల్లీ మెట్రోలోని అన్ని లైన్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ప్రతి స్టేషన్లోని ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల దగ్గర మాత్రమే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసే సదుపాయం కల్పిస్తున్నామని, దశల వారీగా స్టేషన్లలోని ఇతర ప్రాంతాల్లో కూడా క్యూఆర్ కోడ్ల స్కానింగ్ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది.