న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో విధించిన లాక్డౌన్ నుంచి నగరవాసులకు ఊరట లభించింది. కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో అన్లాక్ ప్రక్రియ ఊపందుకుంది. ఢిల్లీ మెట్రో సేవలు సోమవారం నుంచి పునరుద్దరించారు. సరి బేసి పద్థతిలో షాపులు తెరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతించడంతో వ్యాపారులు ఉదయాన్నే షాపులను ఓపెన్ చేశారు. ఇక కరోనా వైరస్ కేసులు భారీగా దిగిరావడంతో అన్లాక్ ప్రక్రియను దశల వారీగా చేపడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల వెల్లడించారు.
50 శాతం ప్రయాణీకులతో మెట్రో రైళ్ల రాకపోకలను అనుమతిస్తామని, ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ సరి, బేసి పద్దతిలో షాపులను తెరిచేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఇక ఢిల్లీ మెట్రో సేవలను పునరుద్ధరించడంతో నగర ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థలు 50 శాతం హాజరుతో సేవలు అందించేందుకు అనుమతించడంతో పలువురు ప్రైవేట్ ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకున్నారు. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్మాణ రంగ కార్యకలాపాలతో పాటు ఫ్యాక్టరీల కార్యకలాపాలకు ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపింది.