న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటేసేందుకు అనుమతి లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యాంగ నిబంధనలు చాలా స్పష్టంగా చెబుతున్నాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పేర్కొన్నది. ఢిల్లీ మేయర్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని కోరుతూ ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ దాఖలు చేసిన పిటిషన్పై బెంచ్ విచారణ చేపట్టింది.
సమయాభావం వల్ల ఈ పిటిషన్పై ఈ నెల 17న (శుక్రవారం) విచారణ చేపడుతామని న్యాయస్థానం పేర్కొనడంతో.. ఈ నెల 16న షెడ్యూల్ చేసిన మేయర్ ఎన్నికను 17 తర్వాతి తేదీన నిర్వహిస్తామని ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ తరపు న్యాయవాది ఏఎస్జీ సంజయ్ జైన్ కోర్టుకు తెలిపారు. ప్రొటెం ప్రిసైడింగ్ అధికారి నామినేటెడ్ సభ్యులను ఓటు వేసేందుకు అనుమతించడం 343ఆర్ అధికరణను ఉల్లంఘించడమేనని ఆప్ తరపు న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదించారు.