Mayor elections | ఢిల్లీ మేయర్ పదవిని గద్దలా తన్నుకుపోయేందుకు బీజేపీ సిద్ధమైంది. సంఖ్యా బలం లేకపోయినప్పటికీ నామినేటెడ్ సభ్యులు, ఇండిపెండెట్ల మద్దతుతో మేయర్ పదవిని కైవసం చేసుకునే కుట్రకు బీజేపీ తెరలేపింది. మరికాసేపట్లో ఢిల్లీ మున్సిపల్ కమీషన్ (ఎంసీడీ) మేయర్ పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. మొన్నటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పెద్ద ఎత్తున సెక్యూరిటీ బలగాలను రంగంలోకి దింపారు. ఎన్నికలు జరుగుతున్న ఎంసీడీ సమావేశ మందిరంలో గోడలా నిల్చున్నారు. వీరి సాయంతో ఢిల్లీ పీఠాన్ని తమ వశం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరికాసేపట్లో ఢిల్లీ మేయర్ పదవికి ఎన్నిక జరుగనున్నది. షెల్లీ ఓబెరాయ్ను ఆప్ తమ అభ్యర్థిగా నిలపగా.. రేఖా గుప్తాను బీజేపీ తీసుకొచ్చింది. తొలుత 10 మంది నామినేటెడ్ సభ్యులతో తాత్కాలిక స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటికే సభకు వచ్చిన బీజేపీ నేతలు జై శ్రీరాం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తుండగా.. ఆప్ సభ్యులు కూడా వారికి తీసిపోకుండా నినాదాలు చేస్తున్నారు. నామినేటెడ్ సభ్యుల ప్రమాణం తర్వాత మేయర్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. కాగా, ఢిల్లీ మేయర్ పీఠం బీజేపీకే దక్కుతుందని బీజేపీ ఎంపీ హన్స్రాజ్ హన్స్ ప్రకటించడం పట్ల వీరి కుట్రలు బహిర్గతమయ్యాయి. మేయర్ ఎన్నికలో 273 మంది సభ్యులు (10 మంది ఎంపీలు, 13 మంది ఎమ్మెల్యేలు) ఓటు వేయనున్నారు. మెజార్టీ మార్క్ 133 కాగా, ఆప్కు 134 మంది కార్పోరేటర్లు ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు.
ఈ నెల 6 వ తేదీన ఒకసారి మేయర్ పదవికి ఎన్నిక జరిపేందుకు ఎంసీడీ సమావేశమవగా.. బీజేపీ సభ్యుల ఆందోళన మధ్య సమావేశాన్ని వాయిదా వేశారు. ఇవాల్టి సమావేశంలో కూడా గతంలో మాదిరిగానే వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తున్నది. తొలుత ఎన్నికైన కార్పేరేటర్లను ప్రమాణం చేయించకుండా నామినేటెడ్ సభ్యులతో ప్రమాణం చేయించడం రాజ్యంగమార్గానికి వ్యతిరేకమని ఆప్ నేత ముఖేష్ గోయల్ అంటున్నారు.