MCD uproar | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నికలో గందరగోళం నెలకొన్నది. సంఖ్యాబలం లేకున్నా మేయర్ పదవికి పోటీ చేసిన బీజేపీ.. సమావేశాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించింది. వీరికి ఆప్ కౌన్సిలర్లు గట్టిపోటీ ఇచ్చి నిలబడటంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో మేయర్ ఎన్నికను వాయిదా వేశారు. ఈ సందర్భంగా బీజేపీ-ఆప్ సభ్యులు ఒకరినొకరు తోసుకోవడం, కుర్చీలు విసురుకోవడం కనిపించింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించినా.. సమావేశం సజావుగా సాగలేదు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల ప్రక్రియ గందరగోళం మధ్య వాయిదా పడింది. మేయర్ ఎన్నికకు ఓటింగ్ ప్రారంభం కాగానే భారీ రచ్చ మొదలైంది. బీజేపీ సభ్యులు ఎన్నికను హైజాక్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆప్ సభ్యులు విజయవంతంగా అడ్డుకున్నారు. దాంతో ఆప్ సభ్యులపైకి బీజేపీ కార్పోరేటర్లు దూసుకుపోగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో కుర్చీలు, వాటర్ బాటిల్స్ కూడా విసురుకున్నారు. ఎన్నిక జరిపేందుక వాతావరణం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు.
#WATCH | Delhi: Ruckus at Civic Center as BJP, AAP councillors clash with each other amid ensuing sloganeering ahead of Delhi Mayor polls. pic.twitter.com/v1HXUxawSC
— ANI (@ANI) January 6, 2023
అంతకు ముందు 10 మంది నామినేటెడ్ సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు జై శ్రీరాం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా ఆప్ సభ్యులు కూడా నినాదాలు చేశారు. దాంతో సభలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ పదవికి ఆప్ అభ్యర్థిగా షెల్లీ ఓబెరాయ్ రంగంలోకి దిగగా.. బీజేపీ రేఖా గుప్తాను నిలిపింది. గత నెలలో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అయితే, నామినేటెడ్ సభ్యులు, ఇండిపెండెంట్ల సాయంతో మేయర్ పదవిని తన్నుకుపోవాలని బీజేపీ కుట్ర పన్నింది. ఆప్కు 134 మంది కార్పోరేటర్లు ఉండగా.. బీజేపీకి 104 మంది ఉన్నారు. కాగా, 10 మంది ఎంపీలు, 13 మంది ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తారు. ఓటు వేసేందుకు అంతా సిద్ధమైన తరుణంలో ఇలా జరగడం బాధకరమని కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి అభిప్రాయపడ్డారు.