న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా అలజడి మొదలైంది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో.. జనవరి 15వ తేదీ నాటికి ఢిల్లీలో ప్రతి రోజూ సుమారు 25 వేల కేసుల వరకు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీ ఎయిమ్స్లో శీతాకాల సెలవులను రద్దు చేశారు. జనవరి 5 నుంచి 10 తేదీ వరకు వింటర్ వెకేషన్ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తక్షణమే విధుల్లో చేరాలని ఎయిమ్స్ ఫ్యాకల్టీ వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు స్వల్ప స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. సీఎంకు కోవిడ్ రావడం పెద్ద విషయం ఏమీ కాదు అని, కానీ కరోనా ప్రజల్లో వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని మంత్రి జైన్ తెలిపారు.