నడిరోడ్డుపై ఒక యువతి గొంతు కోసి హత్య చేసిన నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే అతన్ని పట్టుకున్న స్థానికులు చావబాదారు. నిందితుడిని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను కూడా అడ్డుకున్నారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానికంగా కూరగాయల దుకాణం నడుపుకునే విభ (30) అనే యువతికి దీపక్ అనే యువకుడితో గొడవ జరిగింది.
మద్యం మత్తులో విభ దంపతులతో దీపగ్ ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే కాసేపటికి తిరిగొచ్చిన దీపక్ తన వెంట ఒక సంచి తీసుకొచ్చాడు. తన వద్దకు రావడానికి ప్రయత్నించిన దీపక్ను చీపురుతో కొడతానని విభ బెదిరించింది. దగ్గరలోని కొన్ని రాళ్లు తీసి అతనిపై విసిరి దూరంగా తరిమేయడానికి ప్రయత్నించింది. దీంతో తన చేతిలోని సంచిలో నుంచి కత్తి తీసిన దీపక్.. విభపై దాడికి తెగబడ్డాడు. ఆమె గొంతు కోసి పారిపోయే ప్రయత్నం చేశాడు.
ఈ దారుణం చూసిన స్థానికులు వెంటనే స్పందించి విభను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించింది. ఆ తర్వాత కాసేపటికే దీపక్ను స్థానికులు పట్టుకున్నారు. రోడ్డుపై పడేసి అతన్ని చావబాదారు. విషయం తెలుసుకొని నిందితుడిని అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను కూడా స్థానికులు అడ్డుకున్నారు. తీవ్రమైన గాయాలతో ఉన్న దీపక్ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. విధులను అడ్డుకున్నారని స్థానికులపై కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు.