Zomato | బిర్యానీ అంటే ఎవరైనా ఇష్టపడతారు. ఆ వాసనకే కడుపు నిండిపోతోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ‘బిర్యానీ’ అంటే చాలు ఎగబడి తింటారు. మరి అంతటి రుచికరమైన బిర్యానీని మన భారతీయులు ఈ ఏడాది అధికంగా తిన్నారట. భోజన ప్రియుల కోసం ప్రస్తుతం అనేక ఫుడ్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో అవసరమైనప్పుడల్లా ప్రజలు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని ఆరగించేస్తున్నారు. ఇటీవల స్విగ్గీ.. నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ వచ్చినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా జొమాటో సైతం తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ యాప్లో సైతం ఎక్కువగా బిర్యానీలే ఆర్డర్ వచ్చినట్లు వెల్లడించింది.
దీంతో పాటు మరో ఆసక్తికర విషయాన్ని జొమాటో వెల్లడించింది. ఈ యాప్ ద్వారా ఓ వ్యక్తి ఈ ఏడాది(2022)లో అత్యధిక ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్గా నిలిచాడు. ఢిల్లీకి చెందిన అంకుర్ ఆహార ప్రియుడు. అతను ఈ ఏడాది జొమాటో యాప్ ద్వారా 3,330 ఆర్డర్లు చేశాడట. అంటే అతడు రోజుకు సగటున 9 ఆర్డర్లు ఇచ్చినట్టు. దీంతో ‘ది నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ..’ అంటూ అంకుర్ని జొమాటో తన వార్షిక నివేదికలో ప్రస్తావించింది.
ఇక డిస్కౌంట్ ప్రోమో కోడ్లను ఉపయోగించుకునే విషయంలో పశ్చిమబెంగాల్లోని రాయ్గంజ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 99.7 శాతం కస్టమర్లు డిస్కౌంట్ ప్రోమో కోడ్ తోనే ఈ ఏడాది ఆర్డర్ చేశారు. ముంబయికి చెందిన ఓ కస్టమర్ ప్రోమో కోడ్ల ద్వారా ఈ ఏడాది జొమాటో ఆర్డర్లపై రూ.2.43 లక్షలను ఆదా చేసుకున్నాడు. కాగా, జొమాటో యాప్లో బిర్యానీ తర్వాత ఎక్కువగా పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ తన నివేదికలో తెలిపింది. ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది.