న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తాజాగా మరో లేఖ రాశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశంపై జరుగుతున్న ఆలస్యంపై నిలదీశారు. బడ్జెట్ను ఎందుకు ఆపారని (Stalling Of Budget) ప్రశ్నించారు. స్పష్టమైన కారణం లేకుండా బడ్జెట్ను నిలిపివేసినట్లు ఆరోపించారు. ప్రజా నిధులను ఎలా వినియోగిస్తున్నారో అన్నది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని అన్నారు.
కాగా, ఆర్థిక నివేదిక ఖరారు చేయడంలో కొంత జాప్యం జరిగిందని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి ఈ నెల 15న అసెంబ్లీలో తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ను మార్చి మొదటి వారం వరకు పొడిగించినట్లు చెప్పారు. అయితే కేంద్రం ఆమోదించిన వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు. అయినప్పటికీ అసెంబ్లీలో బడ్జెట్ను ఎందుకు ప్రవేశపెట్టలేదని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఆ లేఖలో నిలదీశారు.