న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) రోజురోజుకు కరోనా కేసులు (Coivd cases) పెరుగుతూనేఉన్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో 980 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో గతేడాది ఆగస్టు 20 తర్వాత ఒకే రోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గత ఆగస్టు 20న ఢిల్లీ మహానగరంలో 1,190 కేసులు రికార్డయ్యాయి. మంగళవారం 3772 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో పాజిటివిటీ రేటు 25.98 శాతానికి పెరిగింది.
ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 20,16,101కి చేరాయి. ఇందులో 26,545 మంది మరణించారు. 2876 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 170 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు. ప్రతిఒక్కరు బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు. కాగా, కరోనా మహమ్మారి మరోసారి వేగంగా విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేస్తూ పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. గత మూడు దశల్లోనూ కరోనా కేంద్రబిందువుగా ఉన్న మహారాష్ట్రలోని ముంబైలో అధికారులు కఠినంగా నిబంధనలను అమలుచేస్తున్నారు. ముంబైలోని దవాఖానల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నిర్ణయం తీసుకున్నది.