న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా న్యాయ పోరాటానికి దిగారు. తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలపై పరువు నష్టం దావాకు సిద్ధమయ్యారు. ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాఠక్, సంజయ్ సింగ్, జాస్మిన్ షాలకు సోమవారం లీగల్ నోటీసులు పంపారు. తప్పుడు, పరువు నష్టం కలిగించే, హానికరమైన, నిరాధారమైన ప్రకటనలను వ్యాప్తి చేయడం, ప్రసారం చేయడం మానుకోవాలని సూచించారు. సంబంధిత ఆప్ నేతలంతా 48 గంటల్లో దీనికి కట్టుబడి ప్రతికా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువు నష్టం దావా ఎదుర్కోవాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాపై ఆప్ నేతలు పలు విమర్శలు చేశారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 2016లో కేవీఐసీ చైర్మన్గా ఉన్నప్పుడు రద్దు చేసిన రూ.1,400 కోట్ల పాత కరెన్సీని మార్పిడి చేయాలని ఉద్యోగులను సక్సేనా ఒత్తిడి చేశారంటూ ఆగస్ట్ 29న ఆప్ నేతలు ఢిల్లీ అసెంబ్లీలో ఆరోపించారు. అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడి ముంబైలోని ఖాధీ లాంజ్లో ఇంటీరియల్ డిజైన్ కాంట్రాక్ట్ను తన కుమార్తెకు ఇప్పించారని ఆప్ ఆరోపించింది. దీనిపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలని, ఆయనను అరెస్ట్ చేయాలని, తన పదవికి రాజీనామా చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆప్ నేతలకు సోమవారం లీగల్ నోటీసులు పంపారు.