CM Arvind Kejriwal | న్యూఢిల్లీ, మే 6: మద్యం పాలసీ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిక్క్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే)’ నుంచి నిధులు అందుకొన్నారన్న ఆరోపణలపై ఆయనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్ర హోంశాఖకు సిఫారసు చేశారు. ఈ మేరకు గవర్నర్ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టు రాజ్భవన్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. లోక్సభ ఎన్నివేళ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని మంగళవారం పరిగణనలోకి తీసుకొంటామని సుప్రీంకోర్టు గత వారం చెప్పిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. దేవేంద్ర పాల్ భుల్లార్ను విడుదల చేయడంలో సహకరించేందుకుగానూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీకి తీవ్రవాద ఖలిస్థానీ గ్రూపుల నుంచి రూ.133 కోట్ల మేర ఫండింగ్ వచ్చిందనే ఫిర్యాదు గవర్నర్కు అందిందని లేఖలో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు సమర్పించిన ఎలక్ట్రానిక్ ఆధారాలపై ఫోరెన్సిక్ పరీక్షతోపాటు దర్యాప్తు జరుపాలని సక్సేనా లేఖలో కోరినట్టు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.
రూ.133 కోట్ల ఫండింగ్ ఆరోపణలు
వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి అశూ మోంగియా నుంచి ఏప్రిల్ 1న సక్సేనాకు ఫిర్యాదు అందిందని హోంశాఖకు రాసిన లేఖలో ఎల్జీ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. 2014-2022 మధ్య ఖలిస్థాన్ గ్రూపుల నుంచి ఆప్ రూ.133 కోట్ల నిధులు అందుకొన్నదని ఆరోపిస్తూ ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ విడుదల చేసిన ఓ వీడియోను ఫిర్యాదుదారు ప్రస్తావించారని తెలిపారు. ఫిర్యాదుదారు ఆరోపణల తీవ్రత నేపథ్యంలో ఈ అంశంపై ఎన్ఏఐతో సమగ్ర దర్యాప్తునకు ఎల్జీ సిఫారసు చేశారని అందులో పేర్కొన్నారు. 2014 కెనడా, అమెరికా పర్యటన సమయాల్లో కేజ్రీవాల్ పలువురు ఖలిస్థానీ నేతలతో అంతర్గత చర్చలు జరిపారని, ఆ సమావేశాల్లో భుల్లార్ను విడుదలయ్యేలా చూస్తామని వాళ్లకు హామీ ఇచ్చారని ఎల్జీకి చేసిన ఫిర్యాదులో ఆరోపించారు.
ఎవరీ దేవేంద్ర భుల్లార్?
1993లో జరిగిన ఢిల్లీ బాంబు పేలుడులో తొమ్మిది మంది మృతి చెందిన కేసులో దోషిగా తేలిన భుల్లార్ ప్రస్తుతం అమృత్సర్ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. భుల్లార్ను ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 2015 జూన్లో తీహార్ జైలు నుంచి అమృత్సర్ సెంట్రల్ జైలుకు మార్చారు. 2023 డిసెంబర్లో భుల్లార్ ముందస్తు విడుదలను ఢిల్లీ ప్రభుత్వ శిక్షా సమీక్షా బోర్డు తిరస్కరించింది. భుల్లార్ కేసు ముందస్తు విడుదలకు అర్హమైదని కాదని, అలాంటి వ్యక్తి విడుదల అయితే దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం కలుగుతుందని బోర్డు అభిప్రాయపడినట్టు మీటింగ్ మినిట్స్ పేర్కొన్నది.
బీజేపీకి ఓటమి భయం: ఆప్
తాజా పరిణామాలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ సూచన మేరకు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా మరో కుట్ర జరుగుతున్నదని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ‘వాళ్లకు(బీజేపీ) లోక్సభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకొన్నది. ఢిల్లీలోని ఏడు సీట్లలో పరాజయం ఖరారైంది’ అని అన్నారు. ఎల్జీ సక్సేనా అధికార బీజేపీకి ఏజెంట్గా మారారని తీవ్ర విమర్శలు చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ ఈ విధమైన కుట్ర పన్నిందని పేర్కొన్నారు. ‘ఎన్నికల వేళ వార్తల్లో హెడ్లైన్స్ సృష్టించాలని ఎల్జీ సాబ్ ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ కార్యాలయాన్ని ఇది దుర్వినియోగం చేయడమే. ఇదే విషయంలో ఉన్నతస్థాయి జరిపించాలని కోరుతూ దాఖలు చేసిన పిల్ను హైకోర్టు రెండేండ్ల క్రితం కొట్టివేసింది. జగదీశ్ శర్మ అనే వ్యక్తి వేసిన పిల్ పూర్తిగా పనికిమాలినదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు’ అని భరద్వాజ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
మధ్యంతర బెయిల్పై నేడు నిర్ణయం!
మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్కు లోక్సభ ఎన్నికల వేళ మద్యంతర బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకోనున్నది. మిగతా దశల లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పాల్గొంటారా? లేదా? అనేది న్యాయస్థానం తీర్పుపై ఆధారపడి ఉన్నది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై ఉత్తర్వులు జారీ చేయనున్నది.