VK Saxena | ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్-ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మరో కొత్త చిచ్చు రగిలింది. ఈసారి ప్రైవేట్ డిస్కంలలో ప్రభుత్వ నామినీల తొలగింపుతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ప్రైవేట్ డిస్కం బోర్డుల్లో ఉన్న ప్రభుత్వ నామినీలను ఎల్జీ వీకే సక్సేనా తొలగించారు. వీరి స్థానంలో ప్రభుత్వ అధికారులను నియమించారు. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ చర్య చట్ట విరుద్ధమని, రాజ్యాంగవిరుద్ధమని ఆప్ పేర్కొంటున్నది.
ఢిల్లీలో విద్యుత్ డిస్కంలను అనిల్ అంబానీకి చెందిన బీవైపీఎల్, బీఆర్పీఎల్ సంస్థలతో పాటు టాటా సంస్థకు చెందిన ఎన్డీపీడీసీఎల్లు నిర్వహిస్తున్నాయి. ఈ డిస్కంల బోర్డుల్లో ఆప్ ప్రతినిధి జాస్మిన్ షా, ఆప్ సీనియర్ నేత ఎన్డీ గుప్తా కుమారుడు నవీన్ గుప్తాను ప్రభుత్వం తమ నామినీలుగా నియమించింది. అయితే, వీరిద్దరూ ఆయా కంపెనీలకు లాభం చేకూరేలా చట్టవిరుద్ధంగా పదవుల్లో నియమితులయ్యారని, వీరి చర్యల కారణంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఈ కంపెనీలకు రూ.8000 కోట్ల మేర లాభం చేకూరిందని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రైవేటు బోర్డుల నుంచి తొలగింపునకు గురైన వారి స్థానంలో ప్రభుత్వ ప్రతినిధులను నియమించినట్లు వెల్లడించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ బోర్డుల్లో ఫైనాన్స్ సెక్రటరీ, పవర్ సెక్రటరీ అండ్ ఢిల్లీ ట్రాన్స్కో ఎండీలు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండేవారని ప్రకటనలో స్పష్టం చేశారు.
కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్యను ఆప్ తీవ్రంగా ఖండించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను, రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. ఎల్జీ చర్యలు చట్టవిరుద్ధంగా, రాజ్యంగవిరుద్ధంగా ఉన్నాయని విమర్శించింది. ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలనే కుట్రతోనే వారిని తొలగించారని, ఎల్టీ కార్యాలయం చేస్తున్న ఆరోపణలు సత్యదూరాలని ఆప్ పేర్కొన్నది. గత నిబంధనల ప్రకారమే ఇద్దరు నామినీలను నియమించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్నది.