న్యూఢిల్లీ, జనవరి 12: ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) మధ్య వివాదం మరో స్థాయికి చేరింది. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో రాజకీయ ప్రకటనలను ప్రచారం చేసుకున్నారన్న అభియోగాలతో ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీని రూ.164 కోట్లు కట్టాలని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) విభాగం ఆప్కు రికవరీ నోటీసు జారీ చేసింది. ఎల్జీ సక్సేనా ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టింది. 2017 మార్చి 31 వరకు రాజకీయ ప్రకటనలకు ఆప్ రూ.99.31 కోట్ల ప్రభుత్వ నిధులు వినియోగించిందని, దానికి రూ.64.31 కోట్ల జరిమానా కలుపుకొని మొత్తం రూ.163.62 కోట్లు 10 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నది.
ఆ మొత్తం చెల్లించటంలో విఫలమైతే ఢిల్లీలోని పార్టీ ఆఫీస్, ఇతర ఆస్తులకు సీల్ వేయాల్సి వస్తుందని హెచ్చరించింది. రాజకీయ అవసరాలకు ఆప్ వాడిన 164 కోట్లు చెల్లించాల్సిందేనని గత డిసెంబర్ 20న ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీఐపీ నోటీసులు జారీ చేసింది. ఎల్జీ చర్యలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ సర్కారును లక్ష్యంగా చేసుకొని అధికారులను ఎల్జీ, బీజేపీ దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు.