న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా మధ్య మరో వివాదం రాజుకున్నది. ఈసారి ప్రభుత్వ ప్రకటనల విషయంలో సీఎం కేజ్రీవాల్ సర్కార్ను ఎల్జీ టార్గెట్గా చేసుకొన్నారు. ప్రభుత్వ ప్రకటనలను ఆప్ తన పార్టీ సొంత ప్రచారానికి వాడుకొన్నదని పేర్కొంటూ.. ఆప్ నుంచి రూ.97 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఘనవిజయం సాధించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఎల్జీ సక్సేనా ఆదేశాలపై అధికార ఆప్ తీవ్రంగా స్పందించింది.
ఎల్జీ ఆదేశాలు సరికాదని, కోర్టులో సవాల్ చేస్తామని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఆయన ఆ ఉత్తర్వులు ఇచ్చారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. అటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం ఎల్జీకి లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పలు రాష్ర్టాలు ఇక్కడ ప్రకటనలు ఇచ్చాయని, వారు ఖర్చు చేసిన రూ.22 వేల కోట్లను ఎప్పుడు వసూలు చేస్తారని ప్రశ్నించారు.