న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను మరోసారి ఉసి గొల్పింది (LG Vs Kejriwal). ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం పునరుద్ధరణ కోసం చేసిన రూ.44.78 కోట్ల వ్యయంపై ఆయన దృష్టిసారించారు. సంబంధిత ఫైళ్లు, రికార్డులను పరిశీలించి 15 రోజుల్లో నివేదిక పంపాలని చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ను ఎల్జీ ఆదేశించారు. సివిల్ లైన్స్లోని సీఎం అధికార నివాసం సుందరీకరణకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యలో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు మీడియాలో ఆరోపణలు వచ్చినట్లు ఎల్జీ కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అన్ని రికార్డులను భద్రపరచాలని, నిబంధనల ఉల్లంఘనలను పరిశీలించి 15 రోజుల్లో నివేదిక పంపాలంటూ ప్రధాన కార్యదర్శికి ఈ నెల 27న లేఖ రాసింది.
కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు మండిపడ్డారు. 80 ఏళ్ల కిందట నిర్మించిన సీఎం అధికార నివాసంలో ఇప్పటికే మూడుసార్లు పైకప్పు కూలిన సంఘటనలు జరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బిల్డింగ్ నిర్వాహణకు బాధ్యత వహించే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పునరుద్ధరణ పనులు చేసిందన్నారు. ఇందులో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను ఆప్ నేతలు ఖండించారు. ఎల్జీ నివాసానికి రిపేర్ పనుల కోసం రూ.15 కోట్లు వ్యయం కాగా, ప్రధాని మోదీ అధికార నివాసం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.