న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆసుపత్రులు మరోసారి రోగులతో నిండిపోతున్నాయి. అయితే కరోనా లేదా డెంగ్యూ వల్ల కాదు. హస్తిన నగరాన్ని చుట్టేస్తున్న గాలి కాలుష్యమే దీనికి ప్రధాన కారణం. వాయు కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారని ది మెడిసిటీ, మెదాంత చైర్మన్, ఎండీ డాక్టర్ నరేష్ ట్రెహాన్ తెలిపారు. తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో ఢిల్లీ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. చిన్న పిల్లలకు చాలా హాని కలుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ గాలి కాలుష్యం పిల్లల మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, ఢిల్లీని కమ్మేస్తున్న వాయు కాలుష్యం వల్ల తమ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగిందని డాక్టర్ నరేష్ తెలిపారు. తాము ప్రతి సంవత్సరం ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. అయితే గాలి కాలుష్యం సమస్యను పరిష్కరించడంలో లేదా సరిదిద్దడంలో అంతా విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.