న్యూఢిల్లీ: ఒక ఆసుపత్రిలో హోమం (Havan) నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు పలు విమర్శలు చేశారు. ఆసుపత్రిలోని రోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ద్వారకాలోని మణిపాల్ హెల్త్ హాస్పిటల్ భవనంలో ఇటీవల హోమం నిర్వహించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న రోగి ఆరోగ్యం కోసం ఇది నిర్వహించినట్లు ఒక జర్నలిస్ట్ తెలిపారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ ఉన్న మణిపాల్ హెల్త్ హాస్పిటల్ ప్రవేశం వద్ద ఈ హోమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ‘దేవుడా మమ్మల్ని రక్షించు’ అని క్యాప్షన్ ఇచ్చారు.
కాగా, ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన హోమానికి సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు పలు విమర్శలు చేశారు. హోమం కోసం ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను నిలిపివేసి ఉంటారని ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఈ పొగ ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ అంశమన్నారు. అయితే 2021లో డెల్టా స్ట్రెయిన్ వల్ల దేశంలో కరోనా కేసులు పెరిగిన సందర్భంలో కూడా ఇదే ఆసుపత్రిలో హోమం నిర్వహించిన సంగతిని ఒక ట్విట్టర్ యూజర్ గుర్తు చేశారు. దానికి సంబంధించిన పాత ఫొటోను షేర్ చేశారు.
మరోవైపు తమ ఆసుపత్రిలో హోమం నిర్వహించిన సంఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీలోని మణిపాల్ హెల్త్ హాస్పిటల్ యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటనపై క్షమాపణలు చెప్పింది. తమ బృందం తగిన చర్యలు చేపడుతుందంటూ ఆ జర్నలిస్ట్కు బదులిచ్చింది.
that means they have disabled the automatic fire fighting system or else the havan's smoke would have triggered the desired response.
— rushi114 (@rushi1141) March 25, 2023