న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. తన అరెస్టు, ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ విధించటాన్ని కేజ్రీవాల్ సవాల్ చేశారు. అరెస్టు చేసిన సమయాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు విరుద్ధంగా తన అరెస్టు ఉందని కేజ్రీవాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
కేజ్రీవాల్ పీఏ, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ను ప్రశ్నించిన ఈడీ
మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ పీఏ బీభవ్ కుమార్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్లను ఈడీ సోమవారం ప్రశ్నించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వారిద్దరి నుంచి వాంగ్మూలం నమోదుచేసినట్టు ఈడీ తెలిపింది.
ఆప్ మంత్రులపై ఢిల్లీ ఎల్జీ ఆగ్రహం
ఢిల్లీ మంత్రులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన పట్ల శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మంత్రిత్వ శాఖల రోజువారీ కార్యకలాపాలపై చర్చించేందుకు తాను ఆహ్వానించినప్పటికీ వీరు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సాకుగా చూపించి, ఈ మంత్రులు తాను నిర్వహించాలనుకున్న సమావేశాలకు హాజరుకావడం లేదని తెలిపారు. ఈ మేరకు ఎల్జీ సచివాలయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ లేఖను రాసింది.
కేజ్రీవాల్ బీజేపీలో చేరితే ఒక్కరోజులో బయటకొస్తారు: ఆతిశీ
కేజ్రీవాల్ గనుక బీజేపీలో చేరితే, ఆయన ఒక్కరోజులో జైలు నుంచి విడుదల అవుతారని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిశీ అన్నారు. అస్సాంలో దిబ్రూగఢ్లో సోమవారం ఆప్ అభ్యర్థి తరపున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచబోరని, దేశంలోని సాధారణ ప్రజల హక్కుల కోసం తన పోరాటం కొనసాగిస్తారని ఆతిశీ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మాదిరిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బీజేపీలో చేరితే.. కేజ్రీవాల్ కేవలం ఒక్క రోజులో బయటకు వస్తారని అన్నారు.