Delhi High Court : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. కేంద్రం నిషేధించిన ఆ పార్టీ ఎక్స్ ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్షపై ఆ పార్టీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులతో ఇప్పుడు వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆ పరీక్ష పూర్తైనందున ఏ సమస్య ఉండదని, అందువల్ల ఎక్స్ ఖాతా తిరిగి పునరుద్ధరించాలని కోర్టు సూచించింది. ఇటీవల సీజేపీకి చెందిన ఎక్స్ ఖాతాను కేంద్రం నిషేధించింది.
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ అంశంలో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీజీపీ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేయడంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. సీజేపీ ఎక్స్ ఖాతాలో ఆ పార్టీ నీట్ పరీక్షపై పలు పోస్టులు చేసింది. ఇప్పటికే పేపర్ లీకేజీతో ఆందోళనతో ఉన్న విద్యార్థుల్లో సీజేపీ పోస్టులు ఇంకా గందరగోళాన్ని క్రియేట్ చేసేలా ఉన్నాయని, మరింత అభద్రతకు గురయ్యే అవకాశం ఉందని, అందుకే ఆ పార్టీ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేశామని కేంద్రం తెలిపింది. ఆ పార్టీ పోస్టులు పరీక్ష ప్రక్రియకు భంగం కలిగించే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఇప్పుడు నీట్ పరీక్షకు సంబంధించిన పరిస్తితులు మారిపోయాయని, పైగా పరీక్ష కూడా పూర్తైంది కాబట్టి ఇకపై ఎలాంటి గందరగోళానికి తావులేదని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇప్పటి పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఎలాంటి భయాలు ఉండవని కోర్టు చెప్పింది. ఇప్పుడు కూడా సీజేపీ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేయడం న్యాయం కాదని వివరించింది. వీటిని పరిగణనలోకి తీసుకుని సీజేపీ ఎక్స్ ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. సీజేపీ ఎక్స్ ఖాతా.. ఆన్లైన్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో ఈ ఖాతా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.