Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. సెక్షన్ 2సీ ప్రకారం కేజ్రీవాల్పై కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశాలు జారీ చేశారు. కేజ్రీవాల్తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్, సౌరభ భరద్వాజ్, సంజయ్ సింగ్పై కూడా చర్యలకు ఆదేశించింది.
ఈ చర్యలు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినవి. ఈ కేసు విచారణకు సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే, ఈ కేసును విచారించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మపై పలు ఆరోపణలు చేశారు. ఆమె ముందు తాము విచారణకు హాజరుకామని తేల్చిచెప్పారు. దీంతో కేజ్రీవాల్ సహా వీడియోలు షేర్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలకు కోర్టు సిద్ధమైంది. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పందించారు. తనతోపాటు కోర్టును కూడా బెదిరించేందుకు వారు ప్రయత్నించారని జస్టిస్ శర్మ అన్నారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించారని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని విమర్శించారు.
న్యాయపరమైన అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని శర్మ అన్నారు. ఎడిటెడ్ వీడియోలతో తన కుటుంబ సభ్యుల్ని కూడా ఇబ్బంది పెట్టినట్లు ఆమె చెప్పారు. అయితే, తనను ఎవరూ బెదిరించలేరని వ్యాఖ్యానించారు. ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్పినంత మాత్రాన అది నిజం కాదని, తాను ఈ విషయంలో ఎంతమాత్రం మౌనంగా ఉండబోనని ఆమె వ్యాఖ్యానించారు.