న్యూఢిల్లీ : ద్వారకా ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టు భూసేకరణలో రూ. 850 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వం గురువారం సీబీఐ విచారణకు (CBI Probe) సిఫార్సు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం ఈ వ్యవహారాన్ని సీబీఐ, ఈడీకి నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కామ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కేసును సీబీఐకి రిఫర్ చేసింది.
ద్వారక ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్పై అవినీతి ఆరోపణలకు సంబంధించి విజిలెన్స్ మంత్రి అతిషి నివేదికను సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు పంపిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.
నరేష్ కుమార్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని కూడా కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ను కోరారు. కాగా, ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ తన కుమారుడు కరణ్ చౌహాన్కు చెందిన కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు భూమి విలువను 22 రెట్లు పెంచాడని ఆరోపణలు వచ్చాయి.
Read More :