న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఢిల్లీలో వర్షాలకు హర్యానాలో కురుస్తున్న వర్షాలు కూడా రాజధాని నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హర్యానా నుంచి యుమునా నదిలోకి నీటిని వదులుతుండటంతో ఢిల్లీలోకి భారీగా వరద వస్తోంది.
హర్యానా నుంచి వస్తున్న వరదలతో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఢిల్లీలో తర్వలోనే యమునా నది నీటిమట్టం 206 మీటర్ల స్థాయికి పెరుగుతుందని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అందుకే పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందన్నారు. యమునా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మరోవైపు వరద పరిస్థితిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. యమునా నది ఉగ్రరూపంపై తాము కేంద్ర జల సంఘంతో టచ్లో ఉన్నామని చెప్పారు. అయితే, యమునాలో వరద ఉధృతి అంతకంటే మించే అవకాశం లేదని అంచనాలు చెబుతున్నాయన్నారు. ఒకవేళ యమునా నది నీటిమట్టం 206 మీటర్ల స్థాయిని తాకితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు.
అదేవిధంగా వర్షాల కారణంగా ఢిల్లీలో మూడు చోట్ల రోడ్డు కుంగిపోయిన ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కేజ్రివాల్ వెల్లడించారు. ఇది ఒకరిని ఒకరు నిందించుకునే సమయం కాదని, వర్ష ప్రభావిత రాష్ట్రాలన్నీ ప్రజల కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా రోడ్లపై గుంతలను రాళ్లతో పూడ్చాలన్నారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని NDMC ని కోరినట్లు చెప్పారు. వీవీఐపీలు ఉండే ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాలో కూడా భారీగా వరద నీరు నిలుస్తున్నదన్నారు.