న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాలుష్య నివారణకు తీసుకున్న చర్యల గురించి ఆ అఫిడవిట్లో వివరించింది. విద్యాసంస్థలు మూసివేసి ఆన్లైన్ పద్ధతిలో విద్యాబోధన చేసేందుకు అనుమతించామని తెలిపింది. అదేవిధంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కనీసం 50% మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా ఉత్తర్వులు జారీచేశామని పేర్కొన్నది.
ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వ సంస్థలనే అనుసరించాలని ఆదేశించినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. నిత్యావసర, అత్యవసర సరుకులు మినహా ఇతర వస్తువులను రవాణా చేసే ట్రక్కులపై నవంబర్ 26 వరకు నిషేధం విధించినట్లు అఫిడవిట్లో తెలిపింది. అదేవిధంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించినట్లు పేర్కొన్నది. అంతేగాక రైల్వే, మెట్రో, విమానాశ్రయాలు, భద్రత/రక్షణ సంబంధ పనులు మినహా మిగితా అన్ని నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించినట్లు వివరించింది.
కాగా, నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కాలుష్యానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కాలుష్య నివారణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎన్ని అమలు చేస్తున్నారో స్పష్టతతో రావాలని కేంద్రంతోపాటు ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.