Delhi Excise Policy Case | ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ సింగ్ వాదించారు. ఆప్ జాతీయ కన్వీనర్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అనీ.. ఉగ్రవాది కాదన్నారు. గత కొన్ని నెలలుగా జైలులో ఉన్నా ఆయనను సీబీఐ అరెస్టు చేయలేదని.. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే ఆయన్ని అరెస్టు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు సైతం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసిందని.. ఆ తర్వాత లొంగిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. కోర్టు నిర్ణయం ఖచ్చితంగా సరైందేనన్నారు.
కేజ్రీవాల్ పారిపోవడం లేదని, తప్పుడు కేసులో అరెస్ట్ చేశారని ఆరోపించారు. విచారణకు కేజ్రీవాల్ ఎప్పుడూ సహకరిస్తూ వచ్చారని.. నిద్రపోతున్న సమయంలో కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ ఐదుసార్లు పడిపోయాయని.. ఇది ఆందోళనరమన్నారు. నిద్రపోతున్న సమయంలో షుగర్ లెవల్స్ తగ్గడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతకు మాత్రం రావడం లేదన్నారు. వాస్తవాలను పరిశీలించి బెయిల్ను మంజూరు చేయాలని కోరారు. ఇప్పటి వరకు సీబీఐ క్షమించరాని పని చేయలేదని.. మూడునెలల పాటు శ్రమించి సమాచారం సేకరించిందన్నారు. కేజ్రీవాల్ను ప్రశ్నించేందుకు చట్టం ప్రకారం అనుమతి అవసరమని డీపీ సింగ్ వాదించారు. ఈ కేసులో జనవరిలో సాక్షిగా మారిన మాగుంట వాంగ్మూలం ఇచ్చారని.. అంతకుముందు ఏం చేయలేదన్నారు. దర్యాప్తు సంస్థగా సీబీఐకి సొంత హక్కులు ఉన్నాయని.. ఏ నిందితుడిపై ఛార్జిషీట్ను ఎప్పుడు దాఖలు చేయాలని.. ఏ నిందితుడిని ఎప్పుడు పిలవాలో నిర్ణయించే హక్కు ఉందని పేర్కొన్నారు.