Manish Sisodia | మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియాకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నెల 3న సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయమూర్తి దినేష్ కుమార్ శర్మ మరోసారి విచారణ జరిపారు. ఈడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. సిసోడియాకు బెయిల్ నిరాకరిస్తూనే స్వల్ప ఊరటనిచ్చింది.
ఆయన భార్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన ఇంటికి లేదంటే ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇల్లు, ఆసుపత్రి వద్దకు వెళ్లవచ్చని తెలిపింది. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులతో మినహా మరెవరితోనూ మాట్లాడకూడదని సూచించింది. మొబైల్ సైతం ఇవ్వరని, మీడియాకు దూరంగా ఉండాలని చెప్పింది. సిసోడియా తన భార్యను కలిసేందుకు వెళ్లే చోట మీడియా గుమిగూడకుండా చూడాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, 15 రోజుల మధ్యంతర బెయిల్ను సైతం ఆమోదించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భార్య సీమను కలిసేందుకు అనుమతి ఇస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 9న సిసోడియా అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆయన భార్య సీమ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు నిరాకరించింది.