న్యూఢిల్లీ, డిసెంబర్ 28: నీట్ పీజీ కౌన్సెలింగ్ జాప్యానికి నిరసనగా గత 11 రోజులుగా చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతం చేయాలని రెసిడెంట్ వైద్యులు మంగళవారం నిర్ణయించారు. రెసిడెంట్ వైద్యుల సంఘాలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నిర్వహించిన సమావేశం విఫలమైంది. కేంద్ర మంత్రి ఇచ్చిన హామీలపై రెసిడెంట్ వైద్యులు సంతృప్తిగా లేరని, సోమవారం నాటి ఆందోళనల సమయంలో తమపై దురుసుగా ప్రవర్తించిన ఢిల్లీ పోలీసులు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. సమ్మె కొనసాగించాలని నిర్ణయించినట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఫోర్డా) ప్రధాన కార్యదర్శి అనుజ్ అగర్వాల్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం మంత్రితో భేటీలో తమ డిమాండ్లకు రాతపూర్వక హామీలు ఇవ్వాలని కోరారు.