హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూ లావాదేవీలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న మరో సమస్యకు ధరణిలో పరిష్కారం లభించనున్నది. ఏదేని కారణం వల్ల తాసిల్దార్ ‘డిజిటల్ సంతకం చేయని’ (నాన్ డీఎస్) భూములు ధరణి పోర్టల్లో కనిపించడం లేదు. న్యాయ వివాదాలు, భూ విస్తీర్ణం కన్నా పాస్బుక్లో ఎక్కువగా ఉండటం, ఆధార్ వివరాలు తప్పుగా నమోదవడం, ఆధార్ అనుసంధానం కాకపోవడం.. ఇలా అనేక కారణాల వల్ల డీఎస్ పెండింగ్లో ఉండిపోయింది. కొందరికి అసలు సమస్యేమిటో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం ధరణిలోని గ్రీవెన్స్ మాడ్యూల్లో ‘డిజిటల్లీ అన్సైన్డ్ పీపీబీ’ పేరుతో ఆప్షన్ తీసుకొచ్చింది. ‘నాన్ డీఎస్’ బాధితులు మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భూమి వివరాలు నమోదుచేసిన తర్వాత.. ఒకవేళ డీఎస్ ఎందుకు పెండింగ్లో ఉన్నదో కారణం తెలిస్తే నమోదు చేయాల్సి ఉంటుంది. కారణం తెలియకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్తాయి. అధికారులు వాటిని పరిశీలించి కారణాన్ని వివరిస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే డీఎస్ పూర్తి చేసి కొత్త పాస్బుక్ మంజూరు చేస్తారు. మరోవైపు ఈ నెల 30వ తేదీన సీఎస్ సోమేశ్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ధరణి పనితీరు, సమస్యలు, కొత్త మాడ్యూల్స్, జిల్లాల వారీగా దరఖాస్తులు, వాటిని పరిష్కరిస్తున్న తీరుపై చర్చిస్తారని సమాచారం.