న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రధాని మోదీ తన దోస్తుల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. ఆయన స్నేహితులు ఎందుకు పన్నుల మినహాయింపులు పొందారో? వారి కోట్ల విలువైన రుణాలను ఎందుకు మాఫీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు సమాధానం ఇవ్వాలని నిలదీశారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, మోదీ స్నేహితులకు రూ.5 లక్షల కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చిందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఇప్పుడు ఉచితంగా ఏమీ అందించలేమని చెప్తున్నదని మండిపడ్డారు. మోదీ స్నేహితం దేశ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దిగజార్చిందని ఆరోపించారు.