న్యూఢిల్లీ, నవంబర్ 26: ఢిల్లీ మద్యం పాలసీలో అసలు స్కామే లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో సిసోడియా పేరు లేదు. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘ఇది నాకు గర్వకారణం. ఇన్ని కుతంత్రాలు, తప్పుడు ఎఫ్ఐఆర్ల తర్వాత కూడా వారు నాపై ఎలాంటి అభియోగాలు మోపలేకపోయారు.
సుమారు 800 మంది అధికారులు 500 చోట్ల తనిఖీలు చేసి రూపొందించిన చార్జిషీట్లో నా పేరు లేదు. మద్యం విధానంలో స్కామ్ లేదని సీబీఐ, ఈడీ చార్జిషీట్లు రుజువు చేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే.