Robert Vadra : హర్యానా (Haryana) లోని గురుగ్రామ్ (Gurgao) భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) కు బెయిల్ లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాంతో వాద్రాకు పెద్ద ఉపశమనం లభించినట్లయ్యింది. ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన వాద్రాకు ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాబర్ట్ వాద్రాకు చెందిన ‘స్కై లైట్ హాస్పిటాలిటీ’ సంస్థ.. 2008లో హర్యానాలోని శిఖోపూర్ గ్రామంలో ఒంకార్వేగర్ ప్రాపర్టీస్ నుంచి 3.53 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఈ డీల్ సమయంలో వాద్రా తప్పుడు పత్రాలు సమర్పించారని, ఎలాంటి నగదు చెల్లించకుండా (నగదుగా మారని చెక్కు ద్వారా) లావాదేవీలు జరిపారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. అప్పటి రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి, ఆ భూమికి కమర్షియల్ లైసెన్స్ సంపాదించి, ఆ తర్వాత దానిని ‘డీఎల్ఎఫ్’ సంస్థకు భారీ లాభానికి విక్రయించారని ఈడీ పేర్కొన్నది.
ఈ మొత్తం వ్యవహారం ద్వారా పీఎంఎల్ఏ (PMLA) చట్టం ప్రకారం రూ.58 కోట్ల మేర అక్రమ సొమ్ము ఆర్జించారని ఈడీ తన చార్జ్షీట్లో స్పష్టంచేసింది. ఈ కేసు చార్జిషీట్ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేస్తూ మే 16న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వాద్రా శనివారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఒక షూరిటీ సమర్పించాలనే షరతుపై బెయిల్ మంజూరు చేసింది.
అనంతరం వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అయితే దర్యాప్తు సంస్థ అయిన ఈడీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటోందని, తనను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం చెప్పినట్లు ఈడీ నడుచుకుంటోందని ఆరోపించారు. తన వద్ద దాచడానికి ఏమీ లేదని ఆయన స్పష్టంచేశారు.