న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని (Delhi) చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో హిమాచల్ప్రదేశ్ రాజధాని షిమ్లా (Shimla) కంటే ఢిల్లీలో వాతావరణం చల్లగా మారింది. శుక్రవారం ఉదయం హస్తినలో 4.6 డిగ్రీల సెల్సీయస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఈ సీజన్లో ఇదే అతి తక్కువ అని అధికారులు తెలిపారు. షిమ్లాలో నేడు 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా, ఢిల్లీలో నేడు గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అదే షిమ్లాలో 15 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డవుతుందని వెల్లడించింది.
ఇక ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత వెరీ అన్హెల్తీ కేటగిరీకి చేరింది. శుక్రవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 250గా నమోదయిందని తెలిపింది. అదేవిధంగా ఉత్తర భారతదేశంతోపాటు ఈశాన్య రాష్ట్రాలను ఈ ఉదయం మంచు దుప్పటి కప్పేసింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, మేఘాలయ, త్రిపురలో భారీగా పొగమంచు కురిసింది.