న్యూఢిల్లీ : ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఎల్జీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఎల్జీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దవద్దని, ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎల్జీ వీకే సక్సేనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కోరినట్లు సమావేశం అనంతరం రాజ్ నివాస్ అధికారులు పేర్కొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా ఢిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఎల్జీ జోక్యం విపరీతంగా పెరుగుతుండడాన్ని అందరూ చూస్తున్నారన్నారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వ పనులను రాజకీయ ఉద్దేశాలతో అడ్డుకుంటున్నారని, ఢిల్లీ ప్రజల అవసరాలు, కలలు నెరవేరడం లేదని, ఈ మేరకు ఎల్జీని కలిశానన్నారు. చట్టం, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో అపార్థాలు ఉంటే పరిష్కరించుకోవచ్చనే ఉద్దేశంతోనేనని కలిశానన్నారు. రాజ్యాంగం, మోటారు వాహనాల చట్టం, న్యాయస్థానం నుంచి ఎల్జీకి ఉత్తర్వులు తీసుకువెళ్లానని, తద్వారా సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా చేశానన్నారు.
ఢిల్లీలో పోలీస్, భూమి, పబ్లిక్ ఆర్డర్ అనే మూడు వ్యవహారాలు ఎల్జీకి రిజర్వ్ చేయబడ్డాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎన్నికైన ప్రభుత్వం అన్ని ఇతర విషయాలపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉంటుందని, సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉటంకిస్తూ రిజర్వ్డ్ వ్యవహారాలు కాకుండా.. ఎల్జీ తీసుకున్న నిర్ణయాలను కేజ్రీవాల్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఎంసీడీ ఎన్నికలకు ముందు మొహల్లా క్లినిక్, జల్ బోర్డు చెల్లింపులను నిలిపివేశారని ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన సంబంధించిన పనులు జరగాలంటే కాళ్లు పట్టుకోవాల్సి వస్తే తాను కూడా కాళ్లు పట్టుకుంటామని.. కోర్టు బాట పడతానని చెప్పారు. ఎంతకైనా తెగించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.