ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీనిద్వారా ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోరని నిరూపిస్తామని ప్రకటించారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, అవినీతి పేరుతో తమ నాయకులను కొనేందుకు బీజేపీ.. ఆపరేషన్ లోటస్ చేపట్టిందని సీఎం కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఆప్ ఎమ్మెల్యేలు కమలం పార్టీ ప్రలోభాలను లొంగరని నిరూపించేందుకు సోమవారం అసెంబ్లీ ముందుకు విశ్వాస తీర్మానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ బలపరీక్ష ద్వారా ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ కీచడ్ (బురద)గా మారనుందని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 ఎమ్మెల్యేలకుగాను ఆమ్ ఆద్మీ పార్టీకి 63 మంది సభ్యుల బలం ఉన్నది. కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం సులభంగా మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఉందని లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ పీడీటీ ఆచార్య అన్నారు. సాధారణంగా మెజారిటీ నిరూపించుకోవాలని ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడతాయి. అయితే అధికార పార్టీలు కూడా కాన్ఫిడెన్స్ మోషన్ను సభలో ఎప్పుడైనా ప్రవేశపెట్టవచ్చని చెప్పారు.