న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీబీఐ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన అరెస్టు గురించి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, సీబీఐని పూర్తిగా బీజేపీనే నియంత్రిస్తున్నదని ఆరోపించారు. విచారణకు హాజయ్యే ముందు కేజ్రీవాల్ ఢిల్లీలోని రాజ్ఘాట్ను (Rajghat) సందర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీకి (Bapu ghat) నివాళులర్పించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. కొన్ని దేశ వ్యతిరేక శక్తులు భారత దేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. అయినప్పటికీ దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ఆ శక్తులకు తాను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అడిగే ప్రశ్రలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి .. దాచిపెట్టేందుకు తనవద్ద ఏమీ లేదన్నారు. తనకు అరెస్టుకు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు.
కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా సీబీఐ ఆఫీస్కు వెళ్లారు. కేజ్రీవాల్కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తలు నిరసన చేపట్డారు. ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. సీబీఐ కార్యాలయం వద్ద పార్టీ నేతలు సంజయ్ సింగ్, అతిశి, రాఘవ్ చద్దా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ బీజేపీకి (BJP) వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేశారు. కాగా, పుష్ప సినిమాలో అల్లు అరవింద్ తరహాలో తగ్గేదే లే అని కేజ్రీవాల్ అంటున్నట్లుగా (Kejriwal Rukega Nahin) ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఉదయం ట్విట్టర్లో ఓ ఫొటోను విడుదల చేసింది. ప్రస్తుతం అది తెగ షేరింగ్ అవుతున్నది.
#KejriwalRukegaNahi 🔥 pic.twitter.com/r7rHtb8ZS8
— AAP (@AamAadmiParty) April 16, 2023